పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

  • పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని వ్యాఖ్య
  • ఐపీఎల్ ఫ్రాంచైజీ చెల్లించే సొమ్ముతో ఆ క్రికెటర్ పాక్ ప్రభుత్వానికి పన్ను కడతాడన్న గవాస్కర్
  • ఆ సొమ్ముతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తుందని ఆరోపణ
  • భారత ప్రజలు, సైనికులను బలిగొంటుందన్న గవాస్కర్
ది హండ్రెడ్ లీగ్ కోసం సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. పాకిస్థాన్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు చెందిన యాజమాన్యాలు కలిగిన జట్లు ఏవైనా నైతికంగా పాకిస్థాన్ క్రికెటర్లను దూరం ఉంచాల్సిందే అన్నాడు.

పాకిస్థాన్ క్రికెటర్లను 2008లోనే ఐపీఎల్ నుంచి బహిష్కరించిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు. మన దేశానికి చెందిన క్రికెట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్‌ను తీసుకున్నదని, కానీ 2008లో ముంబై దాడులు జరిగినప్పటి నుంచి మనం పాకిస్థాన్ క్రికెటర్లను దూరం పెట్టామని గుర్తు చేశాడు. పాకిస్థాన్ క్రికెటర్లు తమకు ఐపీఎల్‌లో ఫీజు ద్వారా వచ్చిన మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తాడని, ఆ సొమ్ము అక్కడి ప్రభుత్వం ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఆ ఆయుధాలను వారు మన దేశం పైనే ప్రయోగిస్తారని మండిపడ్డారు. అంటే పాకిస్థాన్ ఆటగాళ్లకు మన జట్టు యాజమాన్యాలు చెల్లించే ఫీజు భారత ప్రజలు, సైనికుల ప్రాణాలు తీయడానికి పరోక్షంగా కారణమవుతుందని అన్నాడు. ఎవరైనా పాకిస్థాన్ ఆటగాళ్లు, సినిమా తారలను పక్కన పెట్టాల్సిందేనని స్పష్టం చేశాడు.

పాక్ క్రికెటర్లకు చెల్లించే సొమ్ము పరోక్షంగా మనవారి ప్రాణాలను తీయడానికి కారణమవుతోందని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌కు చెందిన డానియల్ వెట్టోరికి ఈ విషయం అర్థం కాకపోవడం వల్ల పాకిస్థాన్ క్రికెటర్‌ను తీసుకుందామని భావించి ఉండవచ్చని, కానీ యాజమాన్యానికి అర్థం కావాలి కదా అని అభిప్రాయపడ్డాడు. భారతీయుల జీవితాల కంటే టోర్నీలో గెలవడం ముఖ్యమా అని ప్రశ్నించాడు.

Sunil Gavaskar
Abrar Ahmed
The Hundred League
Pakistan Cricketers
Sunrisers Leeds
IPL Ban

More Telugu News